• చిగురుకల కు స్వాగతం

ఆరుద్ర పాట

ఆరుద్ర  పాట

రెండవ అడుగు

 

 

 

 

ఆరుద్ర పద ప్రయోగాలు కేవలం పాట ప్రయోజనానికే పరిమితం కాలేదు. అంతర్లీనంగా ఒక సందేశాన్నో, యితిహాసాన్నో తెలియజేస్తుంటాయి. మాధుర్యంతో అలరిస్తాయి. సినిమా సన్నివేశానికి ఆలంబన ఒక పార్శ్వం అయితె. మరో పార్శ్వంలో అనుభూతిలోను చేస్తాయి వారి పాటలు.

 

వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటె ఆరుద్ర పాటనే ఆశ్రయించాలి. ఆరుద్ర పాటలు సార్వజనీనతను, సార్వకాలీనతను కలిగివుంటాయి.సూటిగా, స్పష్టంగా చెప్పడం ఒక ఎత్తైతే, వ్యంగ్యం, హాస్యం మోతాదు మించకుండా తెలియజేయడం వారి ప్రత్యేకత.

 

పద ప్రయోగాలు లోకవ్యాప్తంలో వున్నవి వుంటాయి. స్వీయ సృజనవివుంటాయి. పాటకు శబ్ద; అర్థగౌరవాన్ని కల్గించడం వారు పోతన ఒరవడినిసాగారని చెప్పడానికి దోహదపడ్తుంది. పోతన ఆంధ్రమహాభాగవతానికి  శబ్ద,అర్ధగౌరవం కల్గించారని ఆచార్య జి.నాగయ్యగారు, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు అభిప్రాయం వ్యక్తికరించారు. ఇక పాటలో పదప్రయోగవిషయాని కొసై దేవుడుచేసిన మనుషులు (1973) చలనచిత్రంలో

 

                                                      ''విన్నారా! అలనాటి వేణుగానం మ్రోగింది మరల''

 

 అనె పాట పల్లవిలోనే అర్థవంతమైన పదప్రయోగం చేసారు. అందులో రమ్యమైన భావన ఏమిటంటే ''చెలరేగె మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు''.

 

పై పాదంలో చెలరేగే మురళీ సుధలులో 'చెలరేగె' అనే పద పయ్రోగం సాధారణంగా జనవాడకంలో వ్యతిరేకతను సూచించె అర్ధంగా వున్నప్పటికీ. ఆరుద్రగారు ఆ పదాన్ని శుభపరిణామార్థంలో ప్రయోగించి పాటను, సన్నివేశాన్ని రక్తి కట్టించారు.ఇక్కడ 'చెలరేగడం' అనె పదప్రయోగం వువ్వెత్తున ఎగసిపడె .... మురళి అమృత సింధువులు చిలికించినట్లుగా ప్రయోగించారు. విముఖతను సముఖతగా మారింది.

 

ఆ పాట 3 నిమిషాల నిడివి కలదే అయినా అందులో భాగవతం కృష్ణకథాగానం సంపూర్ణంగా తెలియజేస్తుంది.అదే పాటలో ''ద్వేషించే కూటమిలోన నిలచి ప్రేమించె మనిషే కదా మనిషి'' అన్న చరణార్థాన్ని పరిశీలిసై అది ఏసుక్రీస్తుకు కూడా అన్వయం చేసి చెప్పినట్లు అనిపిస్తుంది.

 

అలాగె అన్నపూర్ణ చిత్రంలో (జగపతి వి.బి. రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన తొలి చిత్రం) ''తళ తళా, మిలమిలా పగటిపూట వెన్నెలా'' అన్న అతిశయోక్తిని ప్రయోగించారు. సమాసపరంగా చూసై విశేషణాన్ని పూర్వపదంగా ప్రయోగించినట్లు భావించవచ్చు''.

 

అదేకోవలో 'అంతస్తులు' చిత్రంలో ''వినరా వస్సన్న వేదం చెపుతా వినరన్నా'' అనే పల్లవితో వున్నపాటలో ఒక చరణ పరంగా ''ఏడంతస్తుల మేడలకైనా పునాది భూమిలో వుంటుందీ'' అని తెలియజేయడం నన్నయ ప్రయోగించిన కవితా గుణాల్లో  నానారుచిరార్థ సూక్తి. లోకరీతిని విశధికరించారు ఆరుద్ర. ఈ పాటలో మనకు ప్రధానంగా పేదగొప్ప మధ్యన నైజాలను, నిజాలను విప్పిచెబుతూ, సామ్యవాద భావాన్ని సుస్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చమత్కారాన్ని తెలియజేస్తూ వ్యంగ్యంగా అంటారు''పేదోళ్ల నీతిలో భేదాలు కావన్నా అని నిర్ణయాన్ని సాధికారికంగా తెలియజేస్తారు.

 

 

 

అలాగే ప్రేమపాటను ప్రకృతితో మమేకం చేసి  నాయిక, నాయకుల నడుమ ప్రేమను పదిలం చేస్తూనే పాట చివర ''ప్రాప్తమున్న తీరానికి  పడవ సాగిపోయింది'' అనే వేదాంత ధోరణిని కూడా తెలియజేయడం వారి పాండితిశేముషికిని  దర్శనంగా నిలుస్తుంది.

 

ఆరుద్రగారి పాట కొండగాలిలా తిరిగిన, గోదావరిలా ఎగసినా అది వారికే చెల్లింది. అనుపమవారి 'ఉయ్యాల జంపాల చిత్రంలో వారి పాటకు పురిపుష్టితిని, వారిలోని సాహిత్య సౌకుమార్యతకు నిదర్శనంగా అద్దం పట్టిన పాట ''కొండగాలి తిరిగింది'' అని పాట పల్లవితోనే ''గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది'' అని తెలియజేయడం పరికిసై ఇది జాతిలక్షణ పరంగా (దానినే స్వాభావిక గుణం అంటారు) గోదావరి వరద ఉదృతాన్ని గొప్ప సమయస్పూర్తితో, ఔచిత్యంతో ఆరుద్రగారు ప్రయోగించినట్లు అనిపిస్తుంది.

 

లాక్షణికులు లక్షణ గ్రంధాలలో తెలియబరచిన అలంకారపరంగా పరిశీలిసై. పై పదప్రయోగంలో గోదావరి వరదకు కోరికకు పోలిక చెప్పబడింది. అయితె ఈ పద ప్రయోగంలో సామ్యత కేవలం తీవ్రతా సూచికార్థాన్ని తెలియజేస్తుంది. అలాగె గోదావరి వరదకు, కోరికకుగల స్వాభావిక గుణాలను నిర్దుష్టంగా తెలియజేసినట్లనిపిస్తుంది. స్వాభావిక గుణాలపరంగా చెప్పవలసివసై ఈ పదప్రయోగంలో ఉపమాలకారం కనిపిస్తుంది.

 

అలాగె అలతి అలతి పదప్రయోగాలు చేయడంలో తమదైన పాండితి శేముషి ప్రదర్శిస్తారు ఆరుద్ర.

 

''మేలిమిబంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా? నీ దేహంలో పలువంకరులున్నా చెలిమికరిగేనా?''

 

(కలసి ఉంటె కలదు సుఖం)

 

పై పాటలో 'మెలిక,వంకర' వంటి పద ప్రయోగాలు సారూప్యత ఒక్కటిగానే కన్పిస్తాయి. లోహానికి మెలిక దేహానికి వంకర వంటి ప్రయోగంలో అంగవైకల్యం లక్ష్యానికి ఎప్పుడూ అడ్డురాదనే ఆత్మ స్దైర్యాని పై పాటలో ఆరుద్ర తెలియజేస్తారు.

 

ఇక హాస్యం చిందించే వారి పాటలలో అపురూపమైనది, మనకు గుర్తుకు వచ్చేది 'లక్ష్మినివాసం' చిత్రంలోని వారి సోడపాట తెలుగుప్రాంతమంతా షికారుచేసింది పిఠాపురంగళం, కె.వి. మహాదేవన్‌గారి స్వరంతో ఉర్రుతలాడంచింది. ఆ పాట కేవలం ఉబుసుపోక హాస్యం ఎంత మాత్రం కాదు. అందులో సామాజిక సత్యాలను, , పురాణం అంశాలను ఆ పాటలో మనకు కనిపిస్తాయి. సోడలోని కిక్‌ను తెలియజేస్తాయి.

 

ఉదాహరణకు...

 

''నెతి మీద గంగ వున్న ఈశ్వరుడైనా

నిత్యసుధలు తాగుతున్న దేవతలైనా

ఆంధ్రసోడ కోరికోరి తాగుతారోయ్‌

అది లేకుంటే వడదెబ్బకు తాళుతారోయ్‌'

 

పై చరణంలో 'తాళుతారోయ్‌' అనే పద ప్రయోగం జనవ్యాప్తంలో సంబాళించు అనే అర్ధలో కన్పిస్తుంది.  కాని ఆరుద్రగారు 'తాళుతారోయ్‌'  అనే పదాన్ని సోడా పవర్‌ ఎంతవుందో చెబుతూ, సోడ కిక్‌కు దేవతలు, ఈశ్వరుడు సైతం దాసోహం అంటారని అతిశయోక్తి ప్రయోగించారు. ప్రధానంగా ఇక్కడ మనకు కనిపించేది ఈశ్వరుని నెత్తిన గంగ ఉన్నా, దేవతలు నిత్యం సుధలను రుచి చూసినా, ఆంధ్ర సోడకు మించినది లేదు, ఎవరైనా లొంగిపోతారని చమత్కారికంగా ఆ పాటను రంజింపజేసారు.

 

 

 

 

అలాగె పిన్ని చిత్రంలో పాటలోని పల్లవి వయసు వయ్యారం గురించి ఈ విధంగా అంటారు -

 

''బంగారు ప్రాయమిదె పవళించవెతల్లి

ఈ వయసు దాటితె నిదురేది మళ్ళీ''

 

అని అంత్యప్రాసలు ప్రయోగిస్తూనే ఆడదాని జీవితం ఎంతటి సంకటమయమో తెలియజేయడం వారి భావుకతకు నిదర్శనంగా నిలుస్తుంది. పై పాటలో స్త్రీ జీవితపు ప్రయాణంలో ఎదుర్కునే సమస్యలు అన్నింటినీ దయారసం వుట్టిపడేలా తెలియజేశారు.

 

బాలరాజు చిత్రంలో గైడు పాట-

 

''మహాబలిపురం మహాబలిపురం

భారతీయ కళా జగతికిది కొత్త గోపురం''

 

అనే పల్లవితో  వ్రాసిన పాటలో మహాబలిపురం'  విశేషాలు మనకు సినిమాలో చూస్తే కనులారా  చూసినంత అనుభూతి కల్గింపజేయడమే కాకుండా పాట విన్నప్పుడు కన్నెదుట మహాబలిపురం సాక్షాత్కరింపజేసి ఒక ప్రదేశాన్ని ఇలా కూడా వర్ణించవచ్చు అన్న మార్గాన్ని కవులకు చూపించి మంచి మార్గదర్శనం చేయించారు. అలాగే ఆంధ్రకేసరి చిత్రంలో ''వేదంలా ఘోషించే గోదావరి'' పల్లవితో వ్రాసిన పాటలో 

 

'' కొట్టుకుని పోయె కొన్ని కోటిలింగాలు

వీరేశలింగమొకడె మిగిలెనుచాలు''

 

అన్న చరణం విన్న శ్రోత మనసు ఆనంద జలధిలో ఓలలాడడమే కాకుండా, శరీరం రోమాంచితమై ఆనంభాష్పాలు ఉబికి రావడం అందరికి అనుభంలోకి వచ్చిందే అంటే అతిశయెక్తి ఏ మాత్రం కాదు. అయితే ఈ చరణంలో జరిగింది కూడా అతిశయోక్తి ప్రయోగమే.

 

అలాగే అనువాద పాటల అనుకరణలో నూతనత్వంతో చాటి చెప్పారు. భాష ఏదైనా తెలుగుదనంతో పాటకు పట్టం కట్టిన ఘనాపాటి ఆరుద్ర. భాషకు అనుగుణంగా ఎదురయ్యే హ్రస్వదీర్ఘాలు తమిళ,హిందీభాషలోని పాటలను సన్నివేశానికి అనుగుణంగా రక్తికట్టించారు. తెలుగుదనం నిండిన తెలుగుపాటగానే గుర్తించారు సినీ అభభిమానులు. అలా మనసుకు హత్తుకున్న పాటలను తమ పెదవులపై ఊరేగించారు. హిందీలో నటించిన రాజ్‌కపూర్‌ సినిమా 'ఆహ్‌' తెలుగులో  'ప్రేమలేఖలు' పేరుతో వచ్చింది. ఆ సినిమాలో

 

''పందిట్లో పెళ్లావుతున్నది'', అనే పాట

'' నీ పేరు విన్నా నీ రూపుకన్నా ఉయ్యాల లూగు మది సై సై''

 

హిందీ పాటలను మరిపించే విధంగా అనువాద పాటలను ప్రేక్షక హృదయాలలో అలరారించారు. అదేవిధంగా తమిళంలోని 'సరస్వతీ శపధం' పాటలు ఆరుద్ర అనువాద గీతాలుగా అజరామరమయ్యా కేయి.

 

కొండగాలి తిరిగిన పాట

గుండె ఊసులూగిన చోట

వేదంలా ఊరకలేసే ఆరుద్ర పాట

గోదారి పెదవుల పై చిందులాడిన ఆట

 

 

ఓ కూనలమ్మా !

 

 

       మరోసారి ఆరుద్ర గురించి మళ్లీ కలుసుకుందాము.

 

 

 

డా|| నోరిరాజేశ్వర రావు






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon